Champions Trophy: కోహ్లీ 300వ వన్డేపై న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఆసక్తికర కామెంట్స్.. భారత్, న్యూజిలాండ్ వన్డేపై ఏమన్నాడో తెలుసా?
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని బ్రేస్వెల్ చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : February 28, 2025 / 08:49 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మార్చి 2న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అదరగొడుతుండడంతో మార్చి 2న జరిగే ఫైట్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వనుంది. టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీకి వన్డేల్లో ఇది 300వ మ్యాచ్.
దీంతో కోహ్లీ (36) తన 300వ వన్డేతో.. అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల ఎక్స్క్లూజిల్ క్లబ్లో చేరబోతున్నాడు. ఆ క్లబ్లో చేరనున్న ఎనిమిదో భారత క్రికెటర్గా కోహ్లీ నిలవబోతున్నాడు.
Also Read: అంత మాట అంటారా? నేను సహించను..: భారత మాజీ క్రికెటర్ తండ్రిపై వసీమ్ అక్రమ్ ఫైర్
New Zealand’s seasoned all-rounder, Michael Bracewell
ఈ సందర్భంగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. అలాగే, ఐపీఎల్ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడుతున్నప్పుడు విరాట్ ఎలా ప్రిపేర్ అవుతాడో దగ్గరగా చూసిన అనుభవాన్ని బ్రేస్వెల్ పంచుకున్నాడు.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో ఆ జట్టు నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించి, మంచి ఫామ్లోకి వచ్చాడని మైఖేల్ అన్నాడు. 300 వన్డేలు ఆడటం నిజంగా గొప్ప విషయమని, ఒకే ఫార్మాట్లో ఇది సాధించడమంటే ఎంతో ప్రతిభను కలిగి ఉండాలన్నాడు.
కోహ్లీ తన కెరీర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాడో, ఎలా కష్టపడ్డాడో తాను దగ్గరగా చూశానని బ్రేస్వెల్ చెప్పాడు. కోహ్లీ ఈ మైలురాయిని చేరుకుంటుండడంతో అతడు తన కెరీర్ మొత్తంలో ఎంతటి అంకితభావంతో, కష్టపడి పనిచేశాడో తెలుస్తోందని అన్నాడు.
అలాగే, భారత జట్టులో కోహ్లీ మాత్రమే కాదు, చాలా మంది అద్భుత ఆటగాళ్లు ఉన్నారని, వారిని ఎదుర్కోవడం సవాలు గానే ఉంటుందని బ్రేస్వెల్ అన్నారు. అయితే ఆ సవాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.
అంతేగాక, తమ టీంలో కూడా గొప్ప ఆటగాళ్లు ఉన్నారని, గ్రూప్ ఏలో జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని బ్రేస్వెల్ చెప్పాడు.
