Mukesh Kumar : కర్మ ఎవ్వరిని వదలదు.. భారత పేసర్ ముకేష్ కుమార్ పోస్ట్.. గంభీర్ను ఉద్దేశించేనా?
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు భారత యువ పేసర్ ముఖేష్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
- Thota Vamshi Kumar
- Published On : June 19, 2025 / 11:36 AM IST
Mukesh Kumar Instagram story viral after England tour snub
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు భారత యువ పేసర్ ముఖేష్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘కర్మ సమయం కోసం వేచి చూస్తుంది. మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కర్మ క్షమించదు, ఎల్లప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటుంది.’ అంటూ ముకేష్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చాడు.
అయితే.. ఈపోస్ట్ను అతడు ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అన్న సంగతి మాత్రం తెలియదు. తన క్రికెట్ కెరీర్కు సంబంధించి పెట్టాడా, లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ పోస్ట్ పెట్టాడా? అన్న విషయం తెలియనప్పటికి కూడా నెటిజన్లు మాత్రం ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయకపోవడంతోనే అని అంటున్నారు.
MLC 2025 : కీరన్ పొలార్డ్ మెరుపులు.. సియాటెల్పై న్యూయార్క్ విజయం..
ముఖ్యంగా మరో యువ పేసర్ హర్షిత్ రాణాను భారత జట్టులోకి తీసుకున్న ఒక రోజు తరువాత ముకేష్ ఈ పోస్ట్ పెట్టడంతో అనుమానాలు మొదలు అయ్యాయి. వాస్తవానికి ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో ఇండియా-ఏ తరుపున ఆడిన ముకేష్కుమార్ మంచి ప్రదర్శననే చేశాడు. 92 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. అయితే.. రెండో అనధికారిక టెస్టులో అతడికి ఛాన్స్ రాలేదు.
కానీ.. భారత్-ఏ జట్టులో భాగంగా ఉన్న హర్షిత్ రాణాను ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపిక చేయగా ముకేష్ కుమార్ను మాత్రం తీసుకోలేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టులు ఆడలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతడికి బ్యాకప్గా రాణాను తీసుకున్నారు.
మెరుగైన ప్రదర్శన చేసినప్పటికి తనను ఎంపిక చేయడంతో ముకేష్ కుమార్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు హెడ్కోచ్ గంభీర్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ను చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
