ఉత్కంఠగా జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్‌ అద్భుత విజయం.. పాయింట్ల పట్టికలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఆర్సీబీ

సూపర్‌ ఓవర్‌లో యూపీ ఒక వికెట్‌ కోల్పోయి 8 రన్స్‌ చేసింది.

PIC: UP Warriorz (@UPWarriorz) X

డబ్ల్యూపీఎల్‌ 2025లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై యూపీ వారియర్స్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 180 రన్స్‌ చేసింది.

ఆ జట్టులో ఎలీస్‌ పెర్రీ 90 ( నాటౌట్‌), డానీ వ్యాట్‌ 57 రన్స్‌ చేశారు. ఛేజింగ్‌లో యూపీ వారియర్స్‌ చివరలో ధాటిగా ఆడింది. సోఫీ చివరకు ధాటిగా షాట్లు కొట్టి 33 పరుగులు చేయడంతో యూపీ వారియర్స్ కూడా 180 పరుగులు చేసింది.

దీంతో సూపర్‌ ఓవర్‌లో యూపీ ఒక వికెట్‌ కోల్పోయి 8 రన్స్‌ చేసింది. ఎకిల్‌స్టోన్‌ బౌలింగ్‌ అద్భుతంగా వేయడంతో స్మృతి మంధాన, రిచా ఘోష్‌ ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. కేవలం నాలుగు పరుగులే చేశారు. దీంతో యూపీ వారియర్స్‌ సూపర్ ఓవర్‌లో నాలుగు పరుగుల తేడాతో గెలిచింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో స్మృతి 6, డానీ 57, పెర్రీ 90, రిచా 8, కనిక 5, వేర్‌హామ్‌ 7, కిమ్‌ 2, రాఘవి 0 పరుగులు చేశారు. యూపీ వారియర్స్‌ జట్టులో కిరణ్‌ 24, వృంద 14, దీప్తి 25, తాలియా 0, శ్వేత 31, గ్రేస్‌ 8, ఉమా 14, షినెల్‌ 8, సోఫీ రనౌట్‌ 33, సైమా 14, క్రాంతి 2 పరుగులు చేశారు.

కాగా, డబ్ల్యూపీఎల్‌ 2025 పాయింట్స్‌ టేబుల్‌లో మాత్రం ఆర్సీబీ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు రెండు మ్యాచుల్లో గెలిచి, రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. రెండో స్థానంలో 3 పాయింట్లతో ముంబై ఇండియన్స్ ఉంది.