Rohit Sharma : టీ20ల‌కు ఎంపిక చేస్తారో, చేయ‌రో చెప్పండి.. సెల‌క్ట‌ర్ల‌ను అడిగిన రోహిత్ శ‌ర్మ‌..! ఏమ‌న్నారంటే.?

Captain Rohit Sharma : ఇప్ప‌డు అంద‌రి దృష్టి వ‌చ్చే ఏడాది జూన్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది.

Rohit Sharma

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా 10 విజ‌యాలు సాధించి ఫైన‌ల్ చేరిన భార‌త జ‌ట్టు ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగియ‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి వ‌చ్చే ఏడాది జూన్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మెగాటోర్నీపై దృష్టి సారించింది. ఇప్ప‌టి నుంచే ఇందుకోసం అత్యుత్త‌మ జ‌ట్టును ఎంపిక చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. అయితే.. బీసీసీఐ ప్ర‌ణాళిక‌ల్లో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఉన్నారా..? అనే విష‌యం పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పష్ట‌త లేదు.

2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో టీమ్ఇండియా ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌రుపున రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఆడ‌లేదు. దీంతో ఈ ఫార్మాట్‌లో వీరిద్ద‌రు మ‌ళ్లీ క‌నిపించ‌క‌పోవ‌చ్చు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. అదే సమ‌యంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడ‌డంతో టీ20కి సైతం అత‌డే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌-యూఎస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న‌ను ఆడిస్తారా..? లేదా..? అన్న విష‌యాల‌ను చెప్పాల‌ని బీసీసీఐ అధికారుల‌ను రోహిత్ శ‌ర్మ అడిగిన‌ట్లు తెలుస్తోంది.

Also Read: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ స్పిన్న‌ర్ బిష్ణోయ్ దూకుడు.. ఏకంగా అగ్ర‌స్థానం.. సూర్య సంగ‌తేంటంటే..?

ముందే చెబితే మంచిది..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో ఓట‌మిపై ఇటీవ‌ల ఢిల్లీలో బీసీసీఐ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ మీటింగ్‌ల‌కు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా, ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ సెల్ల‌ర్‌, సెలక్షన్ కమిటీ చీఫ్‌ అజిత్‌ అగార్కర్‌ల‌తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్‌, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు హాజ‌రు అయ్యారు. ఆ స‌మ‌యంలో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ స‌మావేశంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎవ‌రు ఉండ‌నున్నారు అనే దానిపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు త‌న‌ను సెల‌క్ట్ చేస్తారో లేదో ఇప్పుడే చెప్పాల‌ని రోహిత్ శ‌ర్మ కోరాడు. ఏ విష‌యం అనేది చెబితే దాన్ని బ‌ట్టి స‌న్న‌ద్దం అవుతాన‌ని హిట్‌మ్యాన్ తెలిపాడు. కోచ్ ద్రవిడ్‌తో పాటు మిగిలిన వారు అంద‌రూ కూడా రోహిత్ సార‌థ్యంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నట్లు ఏకాభిప్రాయంతో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

Also Read : ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ అంటే ఏమిటి..? క్రికెట్‌లో ఇలా ఔటైన టీమ్ఇండియా ఆట‌గాడు ఎవ‌రంటే..?

కాగా.. ద‌క్షిణాఫ్రికాతో పరిమిత ఓవ‌ర్ల సిరీస్‌కు కూడా రోహిత్ శ‌ర్మ‌నే కెప్టెన్‌గా ఉండాల‌ని కోరిన‌ట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. అయితే.. రోహిత్ శ‌ర్మ విశ్రాంతి తీసుకోవాల‌ని కోర‌డంతో వ‌న్డేల‌కు రాహుల్, టీ20ల‌కు సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఎంపిక చేసిన‌ట్లు వివ‌రించారు. డిసెంబ‌ర్ 10 నుంచి ద‌క్షిణాఫ్రికాలో భార‌త ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు మూడు టీ20లు, మూడు వ‌న్డేల‌తో పాటు రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లు ఆడ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు