Sourav Ganguly : కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సౌరవ్ గంగూలీ.. హైవేపై ఒకదానికొకటి ఢీ కొన్న కార్లు..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 21, 2025 / 09:54 AM IST
Sourav Ganguly narrowly escapes car accident
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గురువారం పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్లోని ఓ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు గంగూలీ తన రేంజ్రోవర్ కారులో ప్రయాణిస్తున్నాడు. అతడి కారుతో పాటు మరో రెండు కార్లు కూడా కాన్వాయ్లా వెంట వెలుతున్నాయి. దుర్గాపూర్ ఎక్స్ప్రెస్వేలోని దంతన్పూర్ వద్ద ఓ లారీ అకస్మాత్తుగా గంగూలీ కాన్వాయ్ను ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కాన్వాయ్కు అడ్డుగా వచ్చింది.
దీంతో గంగూలీ ప్రయాణిస్తున్న రేంజ్రోవర్ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్లు వేయాల్సి వచ్చింది. దీంతో కాన్వాయ్లోని కార్లు అదుపుతప్పాయి. ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వాటిలో ఒకటి గంగూలీ కారును ఢికొట్టింది. అయితే.. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు.
ఘటన జరిగిన వెంటనే గంగూలీ కారు దిగి మిగిలిన వారిని పరామర్శించారు. ఈ ఘటన కారణంగా దాదాపు 10 నిమిషాలు గంగూలీ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఆతరువాత యథావిధిగా అతడు షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి హాజరుఅయ్యాడు. కలవరపెట్టే ఘటన జరిగినప్పటికి గంగూలీ ప్రశాంతంగా ఉండి.. కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో సంభాషించాడు. తన క్రికెట్ కెరీర్లోని కొన్ని సంఘటలను పంచుకున్నారు. భారత క్రికెట్ భవిష్యత్తు గురించి చర్చించారు.
IND vs BAN : ఐదో వికెట్ తీసిన తరువాత షమీ ‘ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్’.. తన ఇష్టాన్ని ఇలా..
1992 అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన గంగూలీ 2008 వరకు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 113 టెస్టుల్లో 42.2 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 311 వన్డేల్లో 41 సగటుతో 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 72 అర్థశతకాలు ఉన్నాయి. ఇక 59 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 25.4 సగటుతో 1349 పరుగులు చేశాడు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కొంతకాలం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగానూ పని చేశారు. అక్టోబర్ 2024లో ఆయన జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్లో క్రికెట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టుతో సహా అన్ని క్రికెట్ వెంచర్లను పర్యవేక్షిస్తున్నారు. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్కు ముందు గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
