అంతర్జాతీయ క్రికెట్‌కు మెండీస్ రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్‌కు మెండీస్ రిటైర్మెంట్

Updated On : August 29, 2019 / 3:29 AM IST

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను వణికించిన మిస్టరీ స్పిన్నర్‌ అజంతా మెండిస్‌. అతని దెబ్బకు టీమిండియా సిరీస్‌ కోల్పోయింది. మెండిస్‌ ‘క్యారమ్‌’ బంతులు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాయి. 3 టెస్టులలో ఏకంగా 26 వికెట్లు తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 

చివరిసారిగా అతడు 2015లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం గమనార్హం. సాధారణ స్పిన్నర్‌గా మారిపోవడంతో పాటు గాయాల కారణంగా కెరీర్‌లో వెనుకబడి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. 

ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మెండిస్‌ 19 టెస్టుల్లో 34.77 సగటుతో మెండిస్‌ 70 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 21.86 సగటుతో 152 వికెట్లు తీసిన అతను, 39 టి20 మ్యాచ్‌లలో 66 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మెండిస్‌ పేరిటే అంతర్జాతీయ టి20ల్లో టాప్‌–2 బౌలింగ్‌ ప్రదర్శనలున్నాయి. 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన అతను… అంతకుముందు ఏడాది ఆసీస్‌పై 16 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.