IND vs SL 1st T20: శ్రీలంకతో సిరీస్.. నేటి నుంచే ప్రారంభం!

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది.

Srilanka

IND vs SL 1st T20: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లను భారత్ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

శ్రీలంకతో నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. అందుకు అనుగుణంగానే శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం రుతురాజ్‌ గైక్వాడ్, సంజూ శాంసన్, దీపక్‌ హుడా, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్ తదితర యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌ స్థానాల్లో ఇషాన్ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌లకు జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చింది. సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరం కావడంతో.. వెంకటేశ్ అయ్యర్‌పై మరింత భారం పడింది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. శ్రీలంక సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు.

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో శ్రీలంక దారుణంగా విఫలమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు కూడా భారత జట్టుతో పోలిస్తే శ్రీలంక జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే భారత్‌కి పోటీ ఇవ్వగలదు.. మరి ఈరోజు ఎవరు బోణీ చేస్తారో చూడాలి.