Sunil Gavaskar's Sensational Praise For Dhruv Jurel
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో ధ్రువ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్ల సాయంతో ఒంటరి పోరాటం చేశాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. టీమ్ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సెంచరీకి 10 పరుగుల దూరంలో ఔట్ అయినప్పటికీ.. శతక సమాన ఇన్నింగ్స్ అని పలువురు ప్రశంసిస్తున్నారు.
భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఓ అడుగు ముందుకు వేసి అతడిని ధోనీతో పోల్చాడు. ఇలాంటి ఆరు తీరును మున్ముందు కూడా కొనసాగిస్తే అతడికి తిరుగులేదని జోస్యం చెప్పాడు. ‘అతడి మానసిక పరిణతి నాకు ధోనిని గుర్తు చేస్తోంది. ఈ రోజు అతడి సెంచరీ చేజారొచ్చు కానీ.. ఇదే ఏకాగ్రత్తతో ఆడితే అతడు ఎన్నో శతకాలు చేస్తాడు.’ అని గవాస్కర్ అన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 30 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ధ్రువ్ తన స్కోరుకు మరో 60 పరుగులు జోడించాడు. కుల్దీప్తో కలిసి 76 పరుగులు, ఆకాశ్దీప్తో 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. అనంతరం ధ్రువ్ జురెల్ (90), యశస్వి జైస్వాల్ (73) లు రాణించడంతో టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు టీ విరామానికి ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. బెన్ఫోక్స్ (0), జానీ బెయిర్ స్టో (30) లు క్రీజులో ఉన్నారు.