Raina: టీమ్ఇండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ముద్దుగా చిన్న తలా అని పిలుచుకునే సురేశ్ రైనా(Suresh Raina) లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League) ఆడాలని అనుకుంటున్నాడు. ఎల్పీఎల్ రానున్న ఎడిషన్ కోసం జూన్ 14న వేలం ప్రక్రియను నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్లను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా లంక బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది.
దీంతో సురేశ్ రైనా తన పేరును వేలం ప్రక్రియ కోసం నమోదు చేసుకున్నాడు. అతడు తన బేస్ ప్రైస్ను 50,000 డాలర్లుగా ఉంచినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు రైనా. బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని రకాల క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాడు విదేశీ లీగులు ఆడుకోవచ్చు. దీంతో రైనా ప్రస్తుతం విదేశీ లీగ్లు ఆడుతున్నాడు. ఇప్పటికే అబుదాబి టీ10 లీగ్ సీజన్ 2022లో డెక్కన్ గ్లాడియేటర్ కు ఆడాడు.
ఐపీఎల్లో 2008 నుంచి 2021 వరకు ఆడాడు. సుదీర్ఘ కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే ఆడాడు. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్లు ఆడిన రైనా 32.5 సగటుతో 5,528 పరుగులు చేశాడు. 39 అర్ధశకాలు, ఓ సెంచరీ కూడా చేశాడు. ఎల్పీఎల్లో రైనాను వేలంలో ఏ ప్రాంఛైజీ దక్కించుకుంటుందో జూన్ 14న తెలిసిపోనుంది.
ఇదిలా ఉంటే.. ఎల్పీఎల్లో తొలిసారి వేలాన్ని నిర్వహించనున్నారు. మొదటి మూడు సీజన్లలో ఐదు ప్రాంఛైజీలు నేరుగా డ్రాఫ్ట్ రూపంలో ఆటగాళ్లను తీసుకున్నాయి. తొలిసారి నిర్వహించనున్న వేలం కోసం 140 అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిపి మొత్తం 500 పైగా క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎల్పీఎల్ సీజన్ జూలై 30 ప్రారంభమై ఆగస్టు 20న పూర్తి కానుంది.
Rohit Sharma: డబ్ల్యూటీసీ పాయె.. వన్డే ప్రపంచకప్పై రోహిత్ సేన దృష్టి.. ఈ సారి అలా ఆడతారట