IND vs SA: సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమి.. వారివల్లనే ఓడిపోయామన్న కెప్టెన్ సూర్య
మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఏమిటో చెప్పాడు.
- Harishth Thanniru
- Published On : November 11, 2024 / 08:11 AM IST
Suryakumar Yadav
IND vs SA 2nd T20 : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుంది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించగా.. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియాను దక్షిణాఫ్రికా జట్టు ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అత్యధికంగా 39 పరుగులు చేశాడు. 125 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు ఆది నుంచి తడబాటుకు గురైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు 86 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్ (47నాటౌట్), కొయెట్టీ (19నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త ఆడుతూ పరుగులు రాబట్టారు. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 37 పరుగులు రాబట్టారు. ఫలితంగా మరో ఓవర్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని చేదించింది. దీంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
IND vs AUS : ఆస్ట్రేలియా టూర్కు బయలుదేరి వెళ్లిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో వైరల్
మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఏమిటో చెప్పాడు. భారత్ జట్టు ఓటమికి పేలవ బ్యాటింగ్ కారణమని అన్నారు. బౌలర్లు మెరుగైన బౌలింగ్ చేశారు. టీ20ల్లో 125, 140 స్కోర్లను అడ్డుకోవడం చాలా కష్టమని తెలుసు. కానీ, మా కుర్రాళ్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. ఒక టీ20 మ్యాచ్ లో ప్రత్యర్థి ముందు తక్కువ స్కోర్ ఉండగా ఏ బౌలర్ అయినా ఐదు వికెట్లు తీయడం అంటే చాలా గొప్ప. దక్షిణాఫ్రికాతో 125 పరుగులను కాపాడుకునే క్రమంలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతం అని సూర్యకుమార్ యాదవ్ కొనియాడారు.
ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. తప్పకుండా సిరీస్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని సూర్య కుమార్ చెప్పారు. తదుపరి మ్యాచ్ జోహెన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది. క్రికెట్ అభిమానులకు అక్కడ మరింత ఎంటర్ టైన్మెంట్ ఖాయమని సూర్యకుమార్ అన్నారు.
