IND vs SL : మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే..?
శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : July 29, 2024 / 08:47 AM IST
Surykumar Yadav reacts after 43 run victory in 2nd T20 against Srilanka
Surykumar Yadav : శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. కోచ్గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్లు బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి సిరీస్ను భారత్ సొంతం చేసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం రెండో టీ20లో శ్రీలంక పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
టీ20క్రికెట్లో దూకుడైన ఆటతీరుతోనే ముందుకు సాగుతామని చెప్పాడు. ‘ఈ సిరీస్ ఆరంభానికి ముందే తాము ఎలా ఆడాలని అనుకుంటున్నామో చెప్పాము. అదే ధోరణితో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాము. వాతావరణం పరిస్థితులను గమనించిన తరువాత 160 పరుగుల కంటే తక్కువకే శ్రీలంకను పరిమితం చేయాలని భావించామని, అందుకు తగ్గట్లుగానే బౌలర్లు రాణించారన్నాడు. ఇక వర్షం రావడం కలిసి వచ్చింది. బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. సిరీస్ సొంతం కావడంతో చివరి నామమాత్రమైన టీ20 మ్యాచులో ఇప్పటి వరకు బెంచీకే పరిమితమైన వారిని ఆడించే దానిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.’ సూర్య అన్నాడు.
Also Read : ఏంటి అన్నయా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్నవా..? అంత తొందరేంది..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా (34 బంతుల్లో 53) హాఫ్ సెంచరీ బాదాడు. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 32) రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఇన్నింగ్స్ కాగానే వర్షం పడింది. దాదాపు గంటకు పైగా మ్యాచ్ ఆగిపోయింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతిలో భారత లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30), సూర్యకుమార్ యాదవ్(12 బంతుల్లో 26), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్) ధాటిగా ఆడడంతో లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.
Also Read : ఆసియా కప్ ఫైనల్లో ఓటమి.. భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యాఖ్యలు వైరల్..
