×
Ad

T20 world cup 2026 : ఇలా అయితే పాకిస్థాన్‌పై ఓడిపోవటం ఖాయం.. భారత్ జట్టుకు బిగ్ షాకిచ్చిన నమీబియా.. ఏంది సామీ ఇలా ఆడారు..!

T20 world cup 2026 : టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం రాత్రి భారత్ వర్సెస్ నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ చివరిలో భారత జట్టు బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.

T20 world cup 2026

  • నమీబియా జట్టుపై టీమిండియా విజయం
  • చివరిలో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్.. పరుగులు రాబట్టడంలో విఫలం
  • ఈనెల 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్
  • ఆటతీరులో మార్పురాకుంటే ఓటమి తప్పదన్న ఆందోళనలో టీమిండియా ఫ్యాన్స్ 

T20 world cup 2026 : టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం రాత్రి ఇండియా వర్సెస్ నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), హార్దిక్ పాండ్య (28బంతుల్లో 52) ఆఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు భారీ స్కోర్ రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది.

Also Read : Jasprit Bumrah : వావ్.. రన్నింగ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జస్ర్పీత్ బుమ్రా.. వీడియో వైరల్..

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా బ్యాటర్లు ప్రారంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో క్రమంగా ఔట్ అవుతూ వచ్చారు. దీంతో నమీబియా జట్టు 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు 93 పరుగులతో విజయం సాధించింది. ఇంతవరకు బాగానేఉన్నా.. భారత్ బ్యాటింగ్‌లో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆఫ్ సెంచరీలు చేయడంతో భారత్ స్కోర్ 200 దాటింది. లేదంటే 150 పరుగులకే పరిమితమయ్యేంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు పేలవమైన ఆటతీరును కనబర్చారు.

నమీబియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 17, 18 ఓవర్లలో కలిపి 15 పరుగులే వచ్చాయి. అయినా 19వ ఓవర్లో తొలి బంతికి హార్దిక్ సిక్స్ బాదడంతో స్కోర్ 205 పరుగులకు చేరింది. అలవోకగా మరో 30 పరుగులైనా వస్తాయనిపించింది. కానీ, భారత్ అనూహ్యంగా ఇంకో నాలుగు పరుగులే చేసి అయిదు వికెట్లు కోల్పోయింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హార్దిక్ క్యాచ్ ఔట్ కాగా.. రింకుతో సమన్వయ లోపంతో దూబె రనౌట్ అయ్యాడు. ఆ తరువాత అక్షర్, రింకు సింగ్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. చివరిలో బ్యాటర్లు రాణించినట్లయితే భారత్ స్కోర్ 250కిపైగా దాటేది. కానీ, బ్యాటర్లు వరుసగా విఫలం కావడం.. తరువాత ఆడాల్సింది పాకిస్థాన్ జట్టుతో కావడంతో భారత ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది.

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియా, పాక్ జట్లు తలపడుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తారు. ముఖ్యంగా.. ఇటీవల బంగ్లాదేశ్ ఇష్యూ.. పాకిస్థాన్ బైకాట్ అంశం పెద్దరచ్చకు దారితీసింది. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీన జరగబోయే పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ప్లేయర్లు ఏ చిన్నపాటి తప్పుచేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నమీబియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిలో భారత బ్యాటర్లు ఆడినతీరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పాకిస్థాన్ జట్టుపై ఇదే ఆటతీరు కనబరిస్తే ఓటమి తప్పదన్న ఆందోళన ఫ్యాన్సును వెంటాడుతుంది. పాకిస్థాన్ మ్యాచ్ లోభారత ప్లేయర్లు కాస్త జాగ్రత్తగా ఆడాలంటూ సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫ్యాన్స్ కోరుతున్నారు.