IPL auction 2024 : సిరిసిల్ల కుర్రాడికి లక్ తగిలింది.. ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు కొనుగోలుచేసిన తెలుగు ప్లేయర్స్ వీళ్లే..
ఐపీఎల్ 2024 వేలంలో తెలుగు రాష్ట్రాల్లోని కొందరు యువ ప్లేయర్స్ ను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజా వేలంలో ఆంధ్ర ప్లేయర్ కేఎస్ భరత్ తో పాటు..
- Harishth Thanniru
- Published On : December 20, 2023 / 08:00 AM IST
KS Bharat, Avinish Rao
AP And Telangana Cricket Players : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) వేలం ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది. మొదటి సారి భారతదేశం వెలుపల జరిగిన వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడు పోయారు. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లకు కోల్కతా సొంతం చేసుకోగా, పాట్ కమిన్స్ను రూ.20.50 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. మంగళవారం జరిగిన వేలంలో 10 ప్రాంచైజీలు మొత్తం 72 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. ఇందులో 30 విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మిగిలిన వారు భారత్ ఆటగాళ్లే ఉన్నారు. వీరిలో తెలుగు కుర్రాళ్లు కూడా ఉన్నారు.
ఐపీఎల్ 2024 వేలంలో భారత్ లోని కొందరు యువ ప్లేయర్స్ కు అదృష్టం వరించింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమీర్ రిజ్వీ, జార్ఖండ్ కు చెందిన కుమార్ కుశాగ్ర తోపాటు శివమ్ మావిని, శుభమ్ దూబేని, యశ్దయాల్ వంటి యువ ప్లేయర్స్ ను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మంగళవారం జరిగిన వేలంలో తెలుగు రాష్ట్రాల్లోని కొందరు యువ ప్లేయర్స్ ను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్ భరత్ (రూ.50లక్షలు)ను కోల్ కతా జట్టు కొనుగోలు చేసింది. రికీ భుయ్ (రూ.20లక్షలు) ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. హైదరాబాద్ క్రికెటర్లు అరవెల్లి అవినీశ్ రావును (రూ.20లక్షలు) చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. తనయ్ త్యాగరాజన్ ను పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తరపున ఆడుతున్న అరవెల్లి అవనీశ్ రావును చెన్నై జట్టు దక్కించుకుంది. అవనీశ్ రావుది తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం. ఈ 18ఏళ్ల యువ ప్లేయర్ దూకుడైన బ్యాటర్ తో పాటు వికెట్ కీపర్ కూడా. జనవరి 19న దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే అండర్ -19 ప్రపంచకప్ జట్టుకు కూడా అవనీశ్ రావు ఎంపికయ్యాడు.
