అంపైర్ మతిమరుపు: జేబులో బాల్ పెట్టుకుని అయోమయం

ఐపీఎల్ సీజన్ 2019 ఆరంభం నుంచి అంపైర్లు ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మ్యాచ్ బాల్‌ను సరిగా అంచనా వేయలేని అంపైర్లు నో బాల్ అంటూ పలు మార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. ఈ కారణంతో మహేంద్రసింగ్ ధోనీ కూడా స్టేడియంలో నోరు పారేసుకున్నాడు. మరోసారి బెంగళూరు వేదికగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 

మ్యాచ్ జరుగుతున్నంతసేపు అప్రమత్తంగా ఉండి ప్రతి విషయాన్ని గమనించాల్సిన అంపైర్.. బంతిని తన జేబులో ఉంచుకొని తానే మరిచిపోయాడు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు ఇన్నింగ్స్ జరుగుతుండగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ 14వ ఓవర్ బౌలింగ్ వేసేందుకు సిద్ధమైయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను బాల్ ఇవ్వమని అడిగాడు. 

బంతి కోసం కాసేపు ఆలోచించి తనకు అంతుచిక్కకపోవడంతో ఆ తర్వాత అంపైర్ దగ్గరకు వెళ్లి అడిగాడు. లెగ్ అంపైర్ మైదానమంతా వెదికి ఎక్కడా కనిపించకపోవడంతో విషయాన్ని ఫోర్త్ అంపైర్‌కు తెలియజేశాడు. ఆలస్యం చేయకూడదని భావించిన ఫోర్త్ అంపైర్ కొత్త బాల్ సెట్‌లో ఒకటి ఎంచుకునే విధంగా సూచించాడు. అదే సమయంలో బాల్ ఏమైందనే కోణంలో బిగ్ స్క్రీన్‌పై రిప్లే వచ్చింది. 

శంషుద్దీన్ తన జేబులో బాల్ ఉంచుకుని మర్చిపోయినట్లు తేలింది. తర్వాత ఆ బాల్‌ను బౌలర్‌కు అందించడంతో మ్యాచ్ సజావుగా సాగింది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 202 పరుగులు చేసి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 185పరుగులు మాత్రమే చేయడంతో బెంగళూరు 17 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది.