Vaibhav Soorayvanshi : సచిన్ టెండుల్కర్ రికార్డు కోసమే వైభవ్ను ఆపుతున్నారా? ముంబై లాబీ బలంగా పనిచేస్తోందా..!
Vaibhav Soorayvanshi : సచిన్ టెండూల్కర్ రికార్డు పదిలంగా ఉండటంకోసమే వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా ముబై లాబీ పనిచేస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Vaibhav Soorayvanshi
Vaibhav Soorayvanshi : భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను అభిమానించే వారి నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఈ 15ఏళ్ల బుడ్డోడు బ్యాటు పట్టుకొని క్రీజులోకి వచ్చాడంటే ఎలాంటి బౌలరైనా ఒళ్లుదగ్గర పెట్టుకొని బౌలింగ్ వేయాల్సిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపాన్ని చూపించి ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లోనే కాదు.. దేశవాళీ క్రికెట్లోనూ దుమ్మరేపుతున్నాడు. దీంతో సెలెక్టర్లు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : Asian Games 2026 : ఆసియా గేమ్స్కు భారత మహిళల జట్టు ఇదే.. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోనే..
ఇటీవల భారత జట్టు ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20 మ్యాచ్లు ఆడింది. ఈ రెండు మ్యాచ్లలోనూ ఓటమి పాలైంది. ఐర్లాండ్తో సిరీస్కు వైభవ్ సూర్యవశీని సెలెక్టర్లు ఎంపిక చేసినప్పటికీ.. అరంగేట్రంకు అవకాశం ఇవ్వకపోవటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సిరీస్లో భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఫెయిల్ కావడంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం కల్పించక పోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ రెండు మ్యాచ్లలోనూ అట్టర్ ప్లాప్ అయ్యాడు. రెండో టీ20లో సంజూ, అభిషేక్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఈ క్రమంలో సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే, మరో అంశంపైకూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సచిన్ టెండూల్కర్ రికార్డు పదిలంగా ఉండటంకోసమే వైభవ్ సూర్యవంశీని ఆపుతున్నారని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
1989 నవంబర్ 15వ తేదీన పాకిస్థాన్తో మొట్టమొదటి మ్యాచ్ను సచిన్ టెండూల్కర్ ఆడాడు. దీంతో టీమిండియా తరపున అతిపిన్న వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్గా సచిన్ రికార్డును నమోదు చేశాడు. అప్పుడు సచిన్ వయస్సు 16ఏళ్ల 205 రోజులు.. దీంతో వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తే సచిన్ రికార్డు బద్దలువుతుంది. ప్రస్తుతం వైభవ్కు 15ఏళ్లు మాత్రమే. ఈ క్రమంలో సచిన్ రికార్డును బ్రేక్ కాకుండా ఉండేందుకే వైభవ్ను తుది జట్టులో ఎంపిక చేయడం లేదని, అందుకోసం ముంబై లాబీ బలంగా పనిచేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వైభవ్ సూర్యవంశీ ముంబై వాడు అయ్యిఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం జరిగేందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్, ముంబై ప్లేయర్. అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్కి వీరాభిమాని. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ముంబై వాడే. దీంతో సచిన్ రికార్డు కోసమే వైభవ్ సూర్యవంశీని ఆపుతున్నారనే విమర్శలు ఎక్కువ అయ్యాయి. అయితే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టకుండా ఆపాలంటే అతన్ని కనీసం ఇంకా మరో ఏడాదిన్నర ఆపాల్సి ఉంటుంది. ఇది దాదాపు సాధ్యం కాదన్న వాదనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ ఐదు మ్యాచ్లలో ఏదోఒక మ్యాచ్లోనైనా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం ఉంటుందని పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అలా జరగని పక్షంలో ముంబై లాబీ అనే ప్రచారం నిజమైనట్లు అవుతుందని పేర్కొంటున్నారు. మొత్తానికి ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లోనైనా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఉంటుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
