Hanuma Vihari comments
Hanuma Vihari comments : రంజీట్రోఫీ ప్రస్తుత సీజన్లో టీమ్ఇండియా బ్యాటర్, ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి అదరగొడుతున్నాడు. ఆంధ్ర జట్టుకు ఆడుతున్న విహారీ ఏడు ఇన్నింగ్స్ల్లో 365 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ పై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు జట్టులో లేనందుకు విచారంగా, నిరుత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. అయితే.. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు సహజం అని అన్నాడు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీపైనే ఉందన్నాడు. ప్రస్తుత సీజన్లో అంతా బాగానే ఉందని, పరుగులు చేయడంపై మాత్రమే తాను దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. తాను ఏ జట్టుకు ఆడుతున్నా కూడా వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే చూస్తానని చెప్పాడు. ఎక్కువ పరుగులు సాధించి తిరిగి భారత టెస్టు జట్టులోకి రావాలనేది తన ఆశయం అని 30 ఏళ్ల ఈ క్రికెటర్ తెలిపాడు.
2018లో ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు విహారి. ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 16 టెస్టులు ఆడాడు. 33.6 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై సిడ్నీలో 161 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచి ఈ టెస్టును డ్రా చేసుకోవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక 2022లో ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్ జరిగిన టెస్టు మ్యాచులో ఆఖరి సారిగా టీమ్ఇండియా తరుపున ఆడాడు. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి 33(మొదటి ఇన్నింగ్స్లో 22, రెండో ఇన్నింగ్స్లో 11) పరుగులు చేసి విఫలం అయ్యాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు.
తన చివరి టెస్టు మ్యాచ్ తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనతో మాట్లాడినట్లు విహారి చెప్పాడు. తన ఆటలోని లోపాలను చెప్పాడని, వాటిని సరి చేసుకోవాలని సూచించినట్లు వెల్లడించాడు. ఆ తరువాత నుంచి తనతో ఎవరూ టచ్లో లేనట్లు వివరించాడు. ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నానని, తన ఆట తీరును మెరుగుపరచుకోవడంపైనే దృష్టి సారించినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన కెరీర్ పై ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకునే దశలో లేనని, ఏదైతే అది జరుగుతోందని విహారి అన్నాడు.