Virat Kohli : లైన్లోకి వచ్చిన కోహ్లీ.. రియాన్ పరాగ్కు బంపర్ ఆఫర్..!
శ్రీలంకతో వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్కు తాము అందుబాటులో ఉంటామని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తెలియజేసినట్లు సమాచారం.
- Thota Vamshi Kumar
- Published On : July 18, 2024 / 06:39 PM IST
Virat Kohli in line to play ODIs in Sri Lanka Reports
Virat Kohli : శ్రీలంకతో వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్కు తాము అందుబాటులో ఉంటామని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తెలియజేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాలనుకునే సీనియర్ ఆటగాళ్లు ఖచ్చితంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండాలని కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్న గంభీర్ చేసిన అభ్యర్థనకు సీనియర్ ఆటగాళ్లు స్పందించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది.
ఛాంపియన్ ట్రోఫీకి ముందు భారత జట్టు కేవలం రెండు వన్డే సిరీస్లు మాత్రమే ఆడనుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే లంకతో మూడు వన్డేలతో పాటు ఇంగ్లాండ్తో మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ క్రమంలో ఈ వన్డే మ్యాచుల్లో ఖచ్చితంగా సీనియర్ ఆటగాళ్లు ఆడాలని గంభీర్ సూచించాడు. తొలుత లంక పర్యటన వెళ్లొందని, విశ్రాంతి తీసుకోవాలని రోహిత్, కోహ్లీ భావించారు. అయితే గంభీర్ అభ్యర్థన మేరకు వీరిద్దరు మనసు మార్చుకున్నట్లుగా అర్థమవుతోంది.
ICC : అమెరికాలో టీ20 ప్రపంచకప్.. భారీ మూల్యం చెల్లించుకున్న ఐసీసీ..! కోట్లలో నష్టం..!
కాగా.. ఈ పర్యటనకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి టెస్టు సీజన్ ఆరంభం కానుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనని ఇప్పటికే బీసీసీఐకి హార్దిక్ సమాచారం ఇచ్చాడు.
జూలై 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. లంక పర్యటనకు సంబంధించి భారత జట్లను బీసీసీఐ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించనుంది. వన్డేల్లో కెప్టెన్గా రోహిత్ శర్మనే వ్యవహరించనుండగా, టీ20ల్లో మాత్రం సూర్యకుమార్కు బాధ్యతలు అప్పగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యువ ప్లేయర్ రియాన్ పరాగ్ టీ20లు, వన్డేలకు ఎంపిక కానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రోడ్డు ప్రమాదం కారణంగా 20 నెలలు వన్డేలకు దూరమైన పంత్ వన్డేల్లో లంక పర్యటనతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
