IND vs SA : రోహిత్‌, కోహ్లీ ద‌క్షిణాఫ్రికాతో టీ20, వ‌న్డేలు ఎందుకు ఆడ‌డం లేదు.. ఇక వారి కెరీర్ ముగిసిన‌ట్లేనా..?

India vs South Africa : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Kohli- Rohit

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వీరిద్ద‌రు ఒంటి చేత్తో జ‌ట్టుకు ఎన్నో విజ‌యాలు అందించారు. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 సెమీ ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత నుంచి వీరిద్ద‌రు టీ20ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోనూ టీ20ల‌తో పాటు వ‌న్డేల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వీరిద్ద‌రిని ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు మాత్ర‌మే ఎంపిక చేశారు.

ఇక వీరిద్ద‌రిని ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు ఎందుకు ఎంపిక చేయ‌లేదు అన్న విష‌యాల‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్ల‌డించింది. వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు త‌మ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని రోహిత్, కోహ్లీలు బోర్డును కోరార‌ని, కొంత‌కాలం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ నుంచి విరామం తీసుకోవాల‌ని వారు భావించిన‌ట్లు బీసీసీఐ తెలిపింది.

Also Read: నాలుగో టీ20 మ్యాచ్ స్టేడియానికి క‌రెంట్ క‌ష్టాలు.. ఫ్ల‌డ్‌లైట్లు వెల‌గాలంటే జ‌న‌రేట‌ర్లే దిక్కు..!

వారిద్ద‌రూ కోర‌డంతో వారిని టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు ఎంపిక చేయ‌లేదని, టెస్టు సిరీస్‌కు మాత్రం ఈ ఇద్ద‌రు అందుబాటులో ఉంటార‌ని తెలిపింది. ఇక మ‌హ్మ‌ద్ ష‌మీ..గాయానికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడ‌ని, అత‌డు మ్యాచుల్లో ఆడేది లేనిది అత‌డి ఫిట్‌నెస్ పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టీ20, వ‌న్డేల్లో రోహిత్‌, కోహ్లీల‌కు ఇక చూడ‌లేమా..?

దాదాపు ఏడాదిగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు టీమ్ఇండియా త‌రుపున టీ20లు ఆడ‌డం లేదు. టీ20 సిరీస్‌ల‌కు వారిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌డం లేదు.. ఎమ‌న్నా అంటే విశ్రాంతి అని చెబుతూ వ‌స్తున్నారు. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నేప‌థ్యంలో యువఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని వారు భావించ‌డంతో ఈ ఫార్మాట్ నుంచి స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇంత వ‌ర‌కు ఈ ఇద్ద‌రు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించ‌లేదు.

Also Read : బెన్‌స్టోక్స్‌కు ఏమైంది..? చేతి క‌ర్ర‌ల సాయంతో న‌డ‌క‌..

ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ముగియ‌డంతో వ‌న్డేల నుంచి సైతం ఈ ఇద్ద‌రూ ఆట‌గాళ్లు త‌ప్పుకుంటార‌ని మెగాటోర్నీకి ముందు నుంచే వార్తలు వ‌స్తున్నాయి. ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా పర్య‌ట‌న‌లో వ‌న్డేల‌కు సైతం ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌లేదు. ఇప్పుడు కూడా ఈ ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్లు విశ్రాంతి కావాల‌ని అడిగార‌ని అంటున్నారు. మ‌రి ఈ లెక్క‌న భ‌విష్య‌త్తులో ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లును ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ (టీ20, వ‌న్డేలు)లో చూసే అవ‌కాశం ఉందో లేదో అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు