Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయంపై బీసీసీఐ అప్డేట్.. బిగ్ షాక్..
వన్డే ప్రపంచకప్లో దూసుకుపోతున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. పూణే వేదికగా బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే
- Thota Vamshi Kumar
- Published On : October 20, 2023 / 03:07 PM IST
PIC @BCCI Twitter
Hardik Pandya injury : వన్డే ప్రపంచకప్లో దూసుకుపోతున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. పూణే వేదికగా బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. భారత్ మ్యాచ్ గెలిచినప్పటికీ పాండ్యగాయం తీవ్రత ఎలా ఉందోనన్న ఆందోళన నెలకొనింది. పాండ్య గాయం పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అప్డేట్ ఇచ్చింది. అతడి గాయానికి స్కానింగ్ నిర్వహించగా ఎడమ కాలి చీలమండలానికి గాయమైనట్లు పేర్కొంది.
వైద్యులు అతడికి వారం రోజులు విశ్రాంతి అవసరం అని సూచించడంతో న్యూజిలాండ్తో మ్యాచ్కు ఈ స్టార్ ఆల్రౌండర్ దూరం అయ్యాడు. అయితే.. అక్టోబర్ 29న ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్కు జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది.
“పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తన సొంత బౌలింగ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండకు గాయమైంది. ఆల్రౌండర్ని స్కాన్ల కోసం తీసుకెళ్లగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అతను బీసీసీఐ వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో ఉంటాడు. అతను అక్టోబర్ 20న జట్టుతో కలిసి ధర్మశాలకు విమానంలో వెళ్లడు. లక్నో లో ఇంగ్లాండ్తో జరగనున్న మ్యాచ్ సమయానికి అతడు జట్టుతో చేరతాడు. అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
గాయం ఎలా అయ్యిందంటే..?
పూణే మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ను హార్దిక్ పాండ్య వేశాడు. ఈ మ్యాచ్లో అతడికి అదే తొలి ఓవర్. మొదటి రెండు బంతులకు లిటన్ దాస్ బౌండరీలు బాదాడు. మూడో బంతిని స్ట్రైట్ గా ఆడగా.. ఆపేందుకు బౌలింగ్ ఫాలో త్రూలోనే హార్దిక్ పాండ్య ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి ఎడమ కాలు మడత పడింది. దీంతో పాండ్య విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడి కాలుకి బ్యాండేజ్ వేశాడు. పాండ్య సరిగ్గా నిలబడలేకపోయాడు.
ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతుల్లో కోహ్లీ రెండు పరుగులు ఇచ్చాడు. మైదానాన్ని వీడిన పాండ్య తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. బ్యాటింగ్లో కోహ్లీ, రాహుల్లే మ్యాచ్ గెలిపించడంతో అతడు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. లిటన్ దాస్ (66), తాంజిద్ హసన్ (51) లు రాణించారు. లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (103 నాటౌట్; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) శతకంతో చెలరేగిపోయాడు.
? NEWS ?
Medical Update: Hardik Pandya ? #CWC23 | #TeamIndiahttps://t.co/yiCbi3ng8u
— BCCI (@BCCI) October 20, 2023
