Pat Cummins
టీ20ల పుణ్యమా అని టెస్టు, వన్డే క్రికెట్లో వేగం పెరిగింది. ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్లతో ప్రేక్షకులను అలరించడమే పనిగా పెట్టుకున్నారు. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో అయితే ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిన తరుణంలో మాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ను క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మరిచిపోరు.
మాక్స్వెల్ పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా.. ఓ వైపు మాక్స్వెల్ విధ్వంసం కొనసాగుతుంటే మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ క్రీజులో పాతుకుపోయాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఒమర్జాయ్, ముజీబ్ వంటి బౌలర్లను అతడు ఎదుర్కొని తన వికెట్ను కోల్పోకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ మ్యాచ్లో కమిన్స్ మొత్తం 68 బంతులు (11.2 ఓవర్లు) ఎదుర్కొన్నాడు. 12 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టు మ్యాచుల కంటే కూడా అతడు జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీ.. డిస్నీ+హాట్స్టార్ పంట పండింది..!
కమిన్స్ గురించి అందరికి తెలిసిందే. భారీ షాట్లను సైతం అవలీల కొట్టగలడు అయినప్పటికీ ఇంత జిడ్డుగా అతడు బ్యాటింగ్ చేసేందుకు ఓ కారణం ఉంది. అప్పటికే ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయింది. తాను ఔట్ అయితే.. ఆడమ్ జంపా, హేజిల్ వుడ్లు మాత్రమే ఉన్నారు. వీరిద్దరిని అఫ్గాన్ బౌలర్లు ఔట్ చేయడానికి ఎంతో సమయం పట్టదని కమిన్స్ భావించడంతో అలా బ్యాటింగ్ చేశాడు. పరుగులు చేసేందుకు కాకుండా క్రీజులో పాతుకుపోయేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు.
మాక్స్వెల్, కమిన్స్లు అభేధ్యమైన ఎనిమిదో వికెట్ 202 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో మాక్స్వెల్ వాటా 179 పరుగులు (88.6 శాతం) కాగా కమిన్స్ 12 పరుగులు (5.94శాతం) కావడం గమనార్హం. కాగా.. తన ఇన్నింగ్స్ పై మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడాడు. తన వికెట్ను కాపాడుకునేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించాడు. ఒకవేళ తాను పెవిలియన్కు చేరుకుంటే ఆడమ్ జంపా రావాల్సి ఉంటుందని, అతడు రిథమ్ను అందుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. కెప్టెన్గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించినట్లు చెప్పాడు.