Celebrities likely to attend IND vs AUS match
వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 20 ఏళ్ల తరువాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులే కాదు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్దేవ్, యువరాజ్ సింగ్ తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం.
టాలీవుడ్ హీరోలు సైతం..
సినీ ప్రముఖుల విషయానికి వస్తే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, మలయాళ నటుడు మోహన్లాల్తో పాటు టాలీవుడ్కు చెందిన హీరోలు విక్టరీ వెంకటేశ్, నాగార్జున, రామ్చరణ్లు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూస్తారని తెలుస్తోంది.
Amitabh Bachchan, Rajinikanth, Kamal Hasan, Mohanlal, Venkatesh, Nagarjuna & Ram Charan will attend the Final of this World cup 2023 at Narendra Modi stadium on Sunday. (Deccan Herald) pic.twitter.com/NoD6Zf8p7y
— CricketMAN2 (@ImTanujSingh) November 17, 2023
అలరించనున్న వాయు సేన విన్యాసాలు..
వన్డే ప్రపంచకప్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది. మ్యాచ్ మొదలు కావడానికి పది నిమిషాల ముందు వాయుసేన విన్యాసాలు ఉండనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు ఆకాశంలో పలు రకాల అద్భుత విన్యాసాలను చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా ఫైనల్ మ్యాచ్కు ముందు ప్రదర్శన ఇవ్వనుంది.