Wrestlers Protest : న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుంది.. వీధుల్లో కాదు కోర్టు ద్వారా!.. సోషల్ మీడియాకు దూరం
న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుంది. అయితే, గతంలోలా రోడ్లెక్కి పోరాటం చేయటం ఉండదు. కోర్టు ద్వారా పోరాటం చేస్తామని రెజ్లర్లు తెలిపారు.
- Harishth Thanniru
- Published On : June 26, 2023 / 10:26 AM IST
Wrestlers Protests
Wrestlers Protest : బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, అతన్ని పదవి నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని నెలలుగా దేశంలోని పలువురు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం విధితమే. వీరిలో సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్తోపాటు బజరంగ్ పునియా, పలువురు రెజ్లర్లు ఉన్నారు. వీరి ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పలు విధానాల్లో వీరు ఆందోళన కొనసాగించారు. పలు పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే, జూన్3న అగ్రశ్రేణి రెజ్లర్లు కొందరు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తరువాత రెజ్లర్ల ఆందోళన తగ్గుముఖం పట్టిందన్న వాదనలు వినిపించాయి. ఇటీవల రెజ్లర్ల నిరసన ముగిసినట్లేనని ప్రచారం జరిగింది.
Wrestlers Protest: సాక్షి మాలిక్, ఆమె భర్త చెప్పిన విషయాలు అసత్యాలు: మైనర్ రెజ్లర్ తండ్రి
బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాన్ని మొదలుపెట్టి ఐదు నెలలు అవుతుంది. తాజాగా రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. తమ నిరసన కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఒకేలాంటి ట్వీట్లను తమతమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. న్యాయం జరిగే వరకు రెజ్లర్ల నిరసన కొనసాగుతుంది. అయితే, గతంలోలా రోడ్లెక్కి పోరాటం చేయటం ఉండదు. కోర్టు ద్వారా పోరాటం చేస్తామని వారు తెలిపారు.
Wrestlers Protest: ఒకరినొకరు తిట్టుకున్న రెజ్లర్లు సాక్షి మాలిక్ – బబితా ఫొగట్
జూన్ 7న ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ప్రభుత్వం రెజ్లర్లకు ఇచ్చిన హామీలను అనుసరించి మహిళా రెజ్లింగ్ ప్లేయర్లు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ప్రభుత్వం ఏడుగురిని అరెస్టు చేసింది. మహిళా రెజ్లర్లు డిమాండ్తో ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పూర్తిచేసి జూన్ 15న కోర్టులో చార్జ్షిట్ సమర్పించారని వారు తెలిపారు. అదేవిధంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సంస్కరణకు సంబంధించి కేంద్రం వాగ్దానం చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చేసిన వాగ్ధానాల నేరవేర్చుతుందని మేము ఎదురుచూస్తున్నామని రెజ్లర్లు తెలిపారు.
అయితే, పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు రెజ్లర్ల నిరసన కొనసాగుతుందని వారు తెలిపారు. రోడ్లపై కాకుండా కోర్టు ద్వారా ముందుకెళ్తామని రెజ్లర్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ పోస్టు చేసిన కొద్దిసేపటి తరువాత ఫోగట్, మాలిక్ సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
