A woman drank insecticide : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు, పోడు వ్యవసాయ దారుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోడు దారులు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ వేయడాన్ని నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు.
పురుగు మందు డబ్బాలతో జేసీబీల ఎదుట ధర్నా చేశారు. ఇరవై ఏళ్ల నుంచి తాము భూములను సాగు చేసుకుంటున్నామని, అధికారులు ఇప్పుడొచ్చి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పోడు దారులు ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు వెళ్లిపోవాలంటూ పోడు దారుల నినాదాలు చేశారు.
అధికారుల తీరుకు నిరసనగా గుండి లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగగా తోటి వారు అడ్డుకున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.