Aasara Pensions : ఆసరా పెన్షన్ల అర్హత వయసును తెలంగాణ ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 57ఏళ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జీవో జారీ కాగా, దరఖాస్తుల స్వీకరణకు నిన్న(ఆగస్టు 13,2021) ఉత్తర్వులు విడుదల చేశారు. 57 ఏళ్లు నిండి అర్హులైన వారు ఆగస్టు 31వ తేదీ వరకు మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ను తప్పనిసరిగా సమర్పించాలి. ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి సర్వీసు రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) మార్గదర్శకాలను జారీ చేసింది.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్ల కింద రూ.2,116 ఇస్తోంది ప్రభుత్వం. దివ్యాంగులకు రూ.3,116 అందిస్తోంది. ప్రస్తుతం 65ఏళ్లు నిండిన వారికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మందికి ప్రయోజనం కలగనుంది.
ఆసరా పెన్షన్ కు అర్హతలు..
* దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు.
* కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలు మించి ఉండకూడదు.
* ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్కు అర్హులు కారు.
* ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు.
* తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు.
* రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరాకు అనర్హులు.
Union Bank : నిరుద్యోగులకు శుభవార్త, 347 ఉద్యోగాలు భర్తీ
రాష్ట్రంలో అర్హులైన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కనీస వయస్సును తగ్గించారని మంత్రులు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను అదేశించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో ఆసరా పెన్షన్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందిస్తున్నారని మంత్రులు చెప్పారు.