Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావుతో జరిపిన సంభాషణలు సేకరించిన ఆధారాలు ఆధారంగా అడిషనల్ ఎస్పీని అదుపులోకి తీసుకున్నారు.
Read Also : Arvind Kejriwal : జైల్లో కేజ్రీవాల్ ఆఫీసు ఏర్పాటుకు కోర్టును ఆశ్రయిస్తాం : భగవంత్ మాన్
గతంలో తెలంగాణ ఇంటిలిజెన్స్లో భుజంగరావు అదనపు ఎస్పీగా పనిచేశారు. భుజంగరావును 8 గంటల విచారణ అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే భుజంగ రావు ఉండగా.. ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు (శనివారం) ఉదయం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు వచ్చారు.
ప్రణీత్రావు ద్వారా పలు ఫోన్లను అధికారులు ట్యాప్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భుజంగరావుతో పాటు మరో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును 6 రోజుల పాటు పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
శనివారం కూడా మరోమారు పోలీసులు ప్రశ్నించారు. ఆదివారం మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రణీత్ ఇచ్చిన సమాచారంతో పలువురు అధికారులు, కానిస్టేబుల్స్ను పిలిచి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు.