Telangana Temperature: తెలంగాణలో ఎండల తీవ్రతపై జిల్లా కలెక్టర్లకు సి.ఎస్. సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు
ఇదిలాఉంటే బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
- Bharath Reddy
- Published On : March 30, 2022 / 08:29 PM IST
High Temp
Telangana Temperature: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటుతూనే భానుడి ప్రతాపానికి గురౌతున్నారు ప్రజలు. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై కలెక్టర్లు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also read:Fianacial Year: ఏప్రిల్ 1నే ఆర్ధిక సంవత్సరం ఎందుకో తెలుసా?
రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఆరోగ్యకేంద్రాలు, ఆసుపత్రుల్లో సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సి.ఎస్. సూచించ్చారు.
Also read:Rahul Gandhi Eyes Telangana : తెలంగాణపై రాహుల్ గాంధీ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం
అత్యవసర సందర్భాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలన్నా సీఎస్ సూచనతో..ఈమేరకు పాఠశాలలో రెండు గంటల సమయాన్ని కుదించింది విద్యాశాఖ. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించ్చారు. ఎండల తీవ్రతకు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఇదిలాఉంటే బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
Also read:Hyderabad : వివాదమవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..స్పీకర్ కు తప్పని తిప్పలు
