Minister Kishan Reddy: అగ్నిపథ్ పథకం ఒకరికి వ్యతిరేకం కాదు.. మరొకరికి అనుకూలం కాదు.. ఈ ఫథకంలో చేరాలన్న బలవంతం ఏమీలేదు.. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరొచ్చు. కాలపరిమితి పూర్తయిన తరువాత మళ్లీ బయటకు వచ్చి మీకు ఇష్టమొచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు.. అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై మంత్రి స్పందించారు. పథకం ప్రకారమే కుట్ర చేసి రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా ఎంచుకోవటం దారుణమని అన్నారు. ఈ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి అన్నారు.
Agnipath: ‘అగ్నిపథ్’ నిరసనలపై బండి సంజయ్ ఎమన్నారంటే..
అగ్నిపథ్ ఫథకం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో అగ్నిపథ్ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయిల్ లో 12 నెలలు, ఇరాన్ లో 20 నెలల పాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉందని, యూఏఈలోనూ ఇటువంటి పథకం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అయితే భారత్ లో అగ్నిపథ్ పథకం కింద స్వచ్ఛదంగా ఇష్టపడినవాళ్లే చేరవచ్చునని స్పష్టం చేశారు. దేశ సేవ చేయాలన్న తప్పన ఉన్నవాళ్లే అగ్నిపథ్ లో పాల్గొంటారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సైన్యంలో క్రమశిక్షణతో పనిచేసిన వాళ్లు బయటకు వచ్చిన తరువాత 10మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారని, మోదీ ప్రధాని కాకముందు నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు.
Agnipath: సికింద్రాబాద్ కాల్పుల ఘటన.. మృతుడు, క్షతగాత్రుల వివరాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన పథకం ప్రకారం కుట్రచేసి చేసిందని, ఈ ఘటన సమయంలో రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణీకుల బైక్ లు తగలబెట్టారంటూ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సకాలంలో పోలీసులు ఎందుకు రాలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం రాజ్ భవన్ ఎదుట ఆందోళన జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు సకాలంలో పట్టించుకోలేదని, శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. అగ్నిపథ్ పై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులతోనూ చర్చలకు సిద్ధమేనని కిషన్ రెడ్డి అన్నారు.