ఘర్ వాపసీపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ
తాను మళ్లీ సొంతగూటికి వెళుతున్నట్టు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 31, 2024 / 01:28 PM IST
Bhadrachalam MLA Tellam Venkata Rao clarity on Ghar Waapsi
Tellam Venkata Rao on Ghar Wapsi: తాను మళ్లీ సొంతగూటికి వెళుతున్నట్టు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తెల్లం వెంకట్రావు మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో ముచ్చటించడంతో పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నిన్న కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కూడా సొంతగూటికి తిరిగొస్తారన్న ఊహాగానాలు రేగాయి. దీనిపై వివరణ ఇస్తూ బుధవారం ఆయన వీడియో విడుదల చేశారు.
”పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చెందుతుంది. భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి రావటం జరిగింది. భద్రాచలం పట్టణ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందన్న ఒకే ఒక్క ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరాను. భద్రాచలం అభివృద్ధి కొరకే పార్టీ మారడం జరిగింది. అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను తప్పితే పార్టీ మారడం జరగద”ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెల్లం వెంకట్రావు గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించారు. ఏప్రిల్ 7న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. సొంత గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
