BJP Key Meeting : బీజేపీ ముఖ్యనేతల కీలక సమావేశం.. ఈటల చేరిక, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు
- Naveen
- Published On : June 11, 2021 / 11:38 AM IST
Bjp Key Meeting
BJP Key Meeting : హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దూరంగా ఉన్నారు. తన గన్ మెన్ కు కరోనా రావడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ సంస్థాగత ఇంఛార్జ్ శివప్రకాష్ హాజరయ్యారు. డీకే అరుణ, డా.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు, విజయశాంతి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, స్వామి గౌడ్, వివేక్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక వంటి అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఈటలతో పాటు ఇతరులను పార్టీలో చేర్చుకునే విషయమై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలతో పాటు ఇతర పార్టీల్లోని నేతలను తమ పార్టీలో చేర్చుకునే విషయమై చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే మరికొందరు కమలం పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. అయితే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ ఆశించిన ఫలితాన్ని సాధించ లేదు. గతంలో కంటే మెరుగైన ఓట్లను సాధించడం ఊరటనిచ్చింది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉపఎన్నిక ఏర్పడనుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
