Kompella Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత కుటుంబ ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?
Kompella Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత, ఆమె భర్త విశ్వనాథ్.. ఇద్దరూ వ్యాపారవేత్తలు. మాధవీలత దంపతులకు రూ.55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
- Sreehari A
- Published On : April 25, 2024 / 04:58 PM IST
BJP's Hyderabad Candidate Kompella Madhavi Latha Declares Assets Of Rs 221 Crore
Kompella Madhavi Latha : తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకెళ్తున్నాయి. ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొంపెల్ల మాధవీలత కూడా నామినేషన్ దాఖలు చేశారు.
Read Also : గుడివాడలో మళ్లీ విజయకేతనం ఎగరేస్తా: ఎమ్మెల్యే కొడాలి నాని
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని అత్యంత ధనిక అభ్యర్థులలో ఒకరైన కొంపెల్ల మాధవీలత తన మొత్తం రూ. 221.37 కోట్ల కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఆమెతో పాటు తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ ఇద్దరూ వ్యాపారవేత్తలు కాగా.. వారి ముగ్గురు పిల్లలకు రూ. 165.46 కోట్ల చరాస్తులు ఉండగా, మాధవీలత దంపతులకు కలిపి రూ.55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
తొలిసారి ఎన్నికల బరిలోకి..
సికింద్రాబాద్లో నివాసం ఉంటున్న 49 ఏళ్ల మాధవీలత ఇటీవలే బీజేపీలో చేరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల్లో రూ.25.20 కోట్ల పెట్టుబడితో సహా రూ. 31.31 కోట్ల చరాస్తులు తనకు ఉన్నాయని ఆమె ప్రకటించారు. అంతేకాదు.. ఆమె పేరిట విరించి లిమిటెడ్లో రూ.7.80 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రూ. 3.78 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి.
చర, స్థిరాస్తుల విలువ ఎంతంటే?
మాదవీలత భర్తకు విరించి లిమిటెడ్లో రూ.52.36 కోట్ల విలువైన షేర్లతో సహా రూ. 88.31 కోట్ల చరాస్తులు ఉన్నాయి. దంపతులపై ఆధారపడిన ముగ్గురు పిల్లలు కూడా రూ. 45 కోట్లకు పైగా మొత్తం చరాస్తులు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి మాధవీలతకు రూ. 6.32 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ఆమె భర్త స్థిరాస్తుల విలువ రూ. 49.59 కోట్లు. అయితే, ఆమెకు ఆస్తులలో హైదరాబాద్, చుట్టుపక్కల వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు ఉన్నాయి.
Read Also : నాలుగో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
మాధవీ లతకు రూ. 90 లక్షల అప్పులు ఉండగా, ఆమె భర్త పేరిట రూ. 26.13 కోట్లు అప్పులు ఉన్నాయి. 2022-23లో ఆమె ఆదాయం రూ. 3.76 లక్షలు కాగా, 2021-22లో రూ. 1.22 కోట్లు. 2022-23లో భర్త విశ్వనాథ్ ఆదాయం రూ. 2.82 కోట్లు కాగా, 2021-22లో రూ. 6.86 కోట్లుగా ఆమె ప్రకటించారు.
బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఒక క్రిమినల్ కేసు కూడా ఉంది. పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో కొంపెల్ల మాధవీలతను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా బరిలో నిలిచారు.
