BRS Protest Narsampet: పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దె కూల్చివేత.. బీఆర్ఎస్ నేతల భారీ ధర్నా.. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట బీఆర్ఎస్(BRS Protest Narsampet) శ్రేణులు చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- V Santhosh Kumar
- Published on- August 10, 2026 / 12:49 PM IST
Brs protest narsampet peddi sudarshan reddy statue demolition traffic jam
- నర్సంపేటలో విగ్రహ గద్దె కూల్చివేత
- బీఆర్ఎస్ నేతల భారీ ధర్నా
- స్తంభించిన ప్రధాన రహదారుల ట్రాఫిక్
BRS Protest Narsampet: వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు స్థలంలో నిలబెట్టిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన గద్దెను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేయడం స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS Protest Narsampet)పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రతినిధులు నడిరోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించడంతో నర్సంపేట పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్
బీఆర్ఎస్ నేతల నిరసన – మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్కు డిమాండ్:
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో ఈ బృహత్ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళనలో మున్సిపల్ మాజీ ఛైర్మన్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడిన నేతలు, ప్రైవేటు స్థలంలో నిర్మించిన గద్దెను కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.
నిలిచిపోయిన రాకపోకలు – స్తంభించిన ట్రాఫిక్:
మెడికల్ కళాశాల ప్రధాన రహదారిపై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైఠాయించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ధర్నా ప్రభావంతో నర్సంపేట-మహబూబాబాద్, నర్సంపేట-కొత్తగూడ, నర్సంపేట-ములుగు ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, నిరసనకారులను సర్దిచెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
