Case Filed Against BJP TRS Leaders : బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఐకెపి కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో జరిగిన జిల్లా పర్యటనలో టిఆర్ఎస్ నేతలు ఆయన పర్యటనను అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అదే క్రమంలో బిజెపి నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుండి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు.
నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకెపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుండి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నదని, ముందస్తు సామాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
Also Read : Extra Marital Affair : ప్రియురాలు-ముగ్గురు ప్రియులు-మధ్యలో భర్త
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో బండి సంజయ్ పర్యటనను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలు అయ్యాయని రంగనాథ్ తెలిపారు. అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు,రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపద్యంలో బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదు చేశామని డిఐజి రంగనాధ్ తెలిపారు.
బండి సంజయ్ పర్యటన నేపధ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు.
అనుమతులు లేకుండా చేసే పర్యటనల క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే అప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ముందుగా అనుమతి తీసుకోవడం ద్వారా కార్యక్రమానికి అనుగుణంగా తాము అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మరో పక్క ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న క్రమంలో అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దని, శాంతి భద్రతల సమస్యలు రాకుండా తమతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని రంగనాధ్ తెలిపారు.