Gadwal MLA DK Aruna
Gadwal MLA DK Aruna : గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖలు రాసింది.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత స్థానంలో ఉన్న డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవాళ (సెప్టెంబర్ 4) కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, గద్వాల నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశం చేసింది.
ఈ మేరకు తెలంగాణ సీఈఓకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి గెజిట్ లో ప్రచురించాలని లేఖలో పేర్కొంది. తెలంగాణ సీఈఓ రాసిన లేఖతో హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు తెలంగాణ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిందని న్యాయవాది రవిశంకర్ జంధ్యాల చెప్పారు. దీంతో డీకే అరుణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందన్నారు. ఇకపై డీకే అరుణ ఎమ్మెల్యే అని జంధ్యాల అన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ డీకే అరుణ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనపై వేటు వేసింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 ఆగస్టు 24న హైకోర్టు తీర్పు ఇచ్చింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2004 నుంచి 2018 వరకు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పాలమూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రకటించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది కోర్టు.