Christmas with prayers
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలు గత రాత్రి నుంచి విద్యుద్దీపాల అలంకరణలతో కనపడుతున్నాయి. కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి రోమన్ క్యాథలిక్ మెట్రోపాలిటన్ కేథడ్రల్ను లైట్లు, క్రిస్మస్ క్రిబ్లతో అందంగా అలంకరించారు.
తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు
మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రాతఃకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చి ఆనవాయితీ ప్రకారం శిలువను ఉరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఇన్చార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశం ఇచ్చారు.
ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా చర్చీలు ముస్తాబు అయ్యాయి. క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని సీఎస్ఐ చర్చిలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు ట్వీట్
“సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చిలో తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి రెడ్డితో కలిసి ప్రార్థనలు చేశారు.