క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్.. ఆ నలుగురికి ఛాన్స్..! కేటాయించే శాఖలపై ఉత్కంఠ
మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : July 3, 2024 / 09:58 AM IST
Telangana Cabinet Expansion
Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. గురువారం కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో కొత్తగా చేరే ఎమ్మెల్యేల పేర్లు ఏఐసీసీ వద్దకు వెళ్లాయి. ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి వర్గ విస్తరణపై మరోసారి అధిష్టానం చర్చలు జరపనుంది. అధిష్టానం ఆమోదిస్తే మంత్రివర్గ విస్తరణపై రాత్రికే నిర్ణయం ప్రకటించి, రేపు ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణకు అందుబాటులో ఉండాలని రేవంత్ కోరినట్లు తెలిసింది.
Also Read : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో కీలక బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే!
తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులుగా ఉన్నారు. మరో ఆరుగురిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త వారికి అవకాశం కల్పిస్తారని తెలిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమ సామాజిక వర్గానికి ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. నలుగురికి మంత్రి పదవులు, ఒకరికి డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకు పరిశీలనలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read : Gossip Garage : రసవత్తరంగా జగిత్యాల రాజకీయం.. ఎవరూ ఊహించని శైలిలో ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ చాణక్యం..!
ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్న వారిలో నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేర్లు దాదాపు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. అదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ ను కేబినెట్ లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఒక మంత్రి పదవి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు, మరో పదవి బీసీ లేదా ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసి పెడుతున్నట్లు సమాచారం.
Also Read : కనీసం ముఖం కూడా చూపెట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డిని లైట్ తీసుకున్న ఎమ్మెల్యే..! ఎందుకీ ధిక్కార స్వరం?
మరోవైపు మంత్రి వర్గంలో శాఖల మార్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సీఎం సహా మంత్రులందరి వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. తాజా మంత్రివర్గ విస్తరణలో మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. మార్పులు చేస్తే ఎవరికి ఏ శాఖను కేటాయిస్తారు.. కొత్తగా మంత్రివర్గంలో చేరే వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని పీసీసీ భావిస్తోంది. మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరనే విషయంపైనా ఇవాళ రేపట్లో తేలే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ పదవికి మహేశ్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
