cm revanth reddy laucnhed sita rama lift irrigation project
CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడకేశాయని, పాలమూరు ప్రజలు వలస వెళ్లడానికి గత ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును గురువారం ఆయన ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి అంకితం చేశారు. రెండవ పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించి, స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
”గత ప్రభుత్వంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలని ఏ ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఎందుకంటే కేసీఆర్, హరీశ్ రావును అడిగినా లాభం లేదనే వారు అడగలేదు. ఇప్పుడు నీళ్లు కావాలని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారంటే.. మా విశ్వసనీయతకు నిదర్శనం. సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయడానికి సహకరిస్తాం. పదేళ్లు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ లు ఇవ్వకుండా కాలం గడిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లకు పెంచింది. ఖర్చు పెట్టింది 7,500 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులను 40 శాతం లోపే పూర్తి చేసింది. మోటార్లు బిగించి నాలుగేళ్లయింది, కరెంట్ బిల్లు కూడా కట్టలేద”ని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.