Kaleshwaram : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు రెడీ అయ్యారు. సీఎంతోపాటు కాంగ్రెస్, మజ్లిస్, సీపీఐ సభ్యులుసైతం అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటకు బయలుదేరి వెళ్తారు. ఇవాళ 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఉదయం 10గంటలకు ప్రారంభం అవుతాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చ జరగాల్సి ఉంది. అయితే, సభలో చర్చ వాయిదావేసి మేడిగడ్డ పర్యటనకు ఎమ్మెల్యేలు వెళ్తారు. సభ ప్రారంభమైన 10 నిమిషాలకు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
Also Read : Video: రాహుల్ యాత్రలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు.. కారు ఆపి, వాళ్ల వద్దకు వెళ్లి రాహుల్ ఏం చేశారో తెలుసా?
మేడిగడ్డ బ్యారేజీ సందర్శకు రావాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తారు. మధ్యాహ్నం 3గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. మేడిగడ్డ వద్దనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు అంశాలపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజాప్రతినిధుల సందర్శన రెండు గంటలపాటు సాగుతుంది. సాయంత్రం 5గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కాబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మేడిగడ్డ పర్యటన అసెంబ్లీ రికార్డుల్లో నమోదు కావడం కోసమే ఇవాళ శాసనసభా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడిగడ్డకు తరలివెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లడం లేదు.