CM Revanth : యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి
ఇవాళ్టి నుంచి ఈనెల 21వ తేదీ వరకు 11రోజులపాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
- Harishth Thanniru
- Published On : March 11, 2024 / 08:04 AM IST
Yadadri Brahmotsavam 2024
CM Revanth Reddy Yadadri Temple Tour : సీఎం హోదాలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు యాదగిరిగుట్టకువెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. ఇవాళ్టి నుంచి యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొని బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో రామకృష్ణారావులు తెలిపారు. మొదటిరోజు స్వస్తి పూజలలో సీఎం, మంత్రులు పాల్గోనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు సాధారణ దర్శనాలను ఆలయ నిర్వాహకులు నిలిపివేశారు. బ్రహోత్సవాల్లో పాల్గొన్నతరువాత ఆలయం నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఆలయ నిర్వాహకులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Also Read : తిరుమలలో 20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ..
ఇవాళ్టి నుంచి ఈనెల 21వ తేదీ వరకు 11రోజులపాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది. ఇదిలాఉంటే 13 నుంచి స్వామివారి అలంకార సేవలు కొనసాగుతాయి. 15 నుంచి సంగీత సాహిత్య మహాసభలు జరుగుతాయి. ఇదిలాఉంటే.. ఈనెల 21వ తేదీ వరకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం నిర్వహణ ఉండదని ఆలయ ఈవో తెలిపారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉంటే.. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులపాట ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.
