బ్యాటిల్ ఫీల్డ్ హీటెక్కుతోంది. సార్వత్రిక సమరంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తగ్గడం లేదు. ప్రతి చిన్న విషయాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంటున్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్కు అంబానీ, అదానీ నుంచి డబ్బులు అందుతున్నాయని కామెంట్స్ చేశారు మోదీ. ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. యాక్షన్ తీసుకోక ఎందుకు ఆగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
మోదీ ఏమన్నారు?
రాహుల్ గాంధీ సడెన్గా అంబానీ-అదానీల గురించి మాట్లాడడం మానేశారెందుకని ప్రధాని మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీ నుంచి ఎంత సొమ్ము తీసుకొన్నారో రాహుల్ చెప్పాలన్నారు. డబ్బు కట్టలతో భారీ వాహనాలు కాంగ్రెస్కు చేరుకున్నాయా.. ఏం ఒప్పందం జరిగింది..? రాత్రికి రాత్రే అదానీ, అంబానీని విమర్శించడం మానేశారంటే… కచ్చితంగా ఏదో ఉందని కామెంట్ చేశారు మోదీ.
రాహుల్ ఏమన్నారు?
అదానీ-అంబానీలపై మాట్లాడటం లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎదురుదాడికి దిగారు. తనకు ట్రక్కులో డబ్బులు అందింది నిజమే అయితే.. సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్చేశారు. టెంపోల్లో డబ్బులు వచ్చినట్లు చెప్తున్నారని..అది మీ వ్యక్తిగత అనుభవమా అని మోదీని ప్రశ్నించారు రాహుల్. ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని..తనకేం భయం లేదన్నారు.
మరి కేటీఆర్?
మోదీ కామెంట్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బులు పంపిస్తుంటే.. ప్రధానికి ఇష్టమైన సీబీఐ, ఈడీ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారా అంటూ ట్వీట్ చేశారు.