Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. ఇద్దరికి చోటు.. లిస్ట్ ఇదే!
Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
- Harish Thanniru
- Updated on- August 7, 2026 / 02:18 PM IST
Telangana Cabinet Expansion
Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతోపాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, కేబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన పలుకుతారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఆమేరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Also Read : Telangana Govt : తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఆగస్టు 15న సర్కార్ మూడు కానుకలు.. వారందరికీ లబ్ధి..
పక్క రాష్ట్రమైన కర్ణాటలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తన ఫోకస్ను తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై పెట్టినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. పలువురు సీనియర్, జూనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పలు సందర్భాల్లో బహిరంగంగానూ మంత్రి పదవి దక్కలేదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈసారి కేబినెట్ విస్తరణలో ఎవరికి అదృష్టం వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు బెర్త్ లలో ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాల వారికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి రేసులో రామచంద్రు నాయక్, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కేఅ వకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుందర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ కొనసాగుతున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. అధిష్టానం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇస్తే.. ఆ జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో సుందర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరో పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా.. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది.
ఈసారి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుత కేబినెట్లో కొనసాగుతున్న వారిలో ఒకరికి ఉద్వాసన పలికే అవకాశాల ఉన్నట్లుగా ఇటీవల కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఒకరికి ఉద్వాసన పలికితే అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి చాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
