Congress Protest : వరుసగా పెట్రో ధరల పెంపును నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మే 4 నుంచి వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండగా.. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. తెలుగు రాష్ట్రాలు సహా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లడక్లో పెట్రోల్ ధర వంద దాటింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 102 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు.
కరోనాతో ఓ వైపు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం అడ్డగోలుగా పెంచుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించే వరకూ పోరాటం ఆగొద్దన్నారు.
13 నెలల్లో, పెట్రోల్పై లీటర్కు 25 రూపాయలు, డీజిల్పై లీటరుకు 24 రూపాయలు పెరిగాయన్నారు ఉత్తమ్. ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు. ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఉత్తమ్.
Read More : Devarayamjal Land Scam : రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు