Montha Cyclone: ‘మొంథా’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ మూడు జిల్లాలకు ముప్పు.. రాత్రి వరకు అప్రమత్తంగా ఉండాలి.. బయటకు రావొద్దు..
Montha Cyclone మొంథా తుపాను ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో తుపాను కారణంగా కుండపోత వర్షాలు
- Harishth Thanniru
- Published On : October 29, 2025 / 07:01 AM IST
Cyclone Montha
Montha Cyclone : ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మంగళవారం రాత్రి డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత బుధవారం ఉదయానికి తుపానుగా.. సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మొంథా తుపాను ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ప్రభావం చూపుతుంది. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతోంది. మంగళవారం హైదరాబాద్ సహా అనే జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా వానలు కురిశాయి. వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో అత్యధికంగా 4.2 సెం.మీ వర్షం కురిసింది. అయితే, మొంథా తుపాను తెలంగాణలోని మూడు జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు.
Also Read: కవిత రాజీనామాను ఆమోదించాలని బీఆర్ఎస్ ఎందుకు కోరట్లేదు? రంగంలోకి బీజేపీ.. ఇకపై..
తుపాను ప్రభావం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కొన్ని చోట్ల 20 సెం.మీలకుపైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మూడు జిల్లాల్లో గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో ఆ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మొంథా తుపాను కారణంగా తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 12 జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని, కొన్ని ప్రాతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
