Harish Rao On DalitBandhu : త్వరలో అన్ని వర్గాలకు దళితబంధు-హరీశ్ రావు
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం..
- Naveen
- Published On : April 18, 2022 / 06:42 PM IST
Harish Rao On Dalitbandhu
Harish Rao On DalitBandhu : జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళితులు పాలాభిషేకం చేశారు. దళితబంధు పథకం కింద లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు కోరారు. గత పాలనలో దళితులు బ్యాంకు లోన్లు కావాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. నూరు శాతం రాయితీతో వారికి నచ్చిన వ్యాపారాలను చేసుకునే విధంగా పది లక్షల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు.
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం కేవలం రూ.12,821 కోట్లు మాత్రమే కేటాయించిందని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ధ్వజమెత్తారు. కళ్యాణలక్ష్మి పథకం తొలుత దళితులకే అమలు చేశామని, ఆ తర్వాత అన్ని వర్గాల వారికి అమలు చేస్తున్నామని హరీష్ రావు గుర్తు చేశారు. అదే విధంగా త్వరలో దళితబంధు స్కీమ్ అన్ని వర్గాలకు అందుతుందని హరీశ్ రావు చెప్పారు.(Harish Rao On DalitBandhu)
CM KCR : ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు : సీఎం కేసీఆర్
దళితబంధు పథకం ద్వారా సంపదను సృష్టించే మార్గాలను వెతుక్కోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు యువత తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శించి అందిపుచ్చుకోవాలని సూచించారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, కార్లు కాకుండా విన్నూత్నంగా రైస్ మిల్లులు, మెడికల్ షాపులు, సిమెంట్ బ్రిక్స్ తయారీ, రెడిమిక్స్, తదితర పరిశ్రమలను స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు.
Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు.. రూ. 17, 700 కోట్లు కేటాయింపు
రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు ఒక విప్లవాత్మక పథకమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. లక్షలాది దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైనంతగా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, దమ్ముంటే ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పెట్టుకుంది. దళిత బంధు పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల నగదును బ్యాంకు ఖాతాలో వేస్తుంది ప్రభుత్వం.
