Mahmood Ali (Photo : Google)
Mahmood Ali : తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో చాలా పటిష్టంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి ఆటంకం ఎదురు కాకుండా పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.
దేశ భవిష్యత్తు యవత చేతిలోనే ఉందన్న మంత్రి మహమూద్ అలీ.. ప్రతి యువతీ యువకుడు బాధ్యతగా ఉండాలని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని ఫస్ట్ బెటాలియన్ లో ఇంటర్ నేషనల్ యాంటీ డ్రగ్స్ డే క్యాంపైనింగ్ నిర్వహించారు. దీనికి మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, హీరోయిన్ కృతి శెట్టి హాజరయ్యారు.
యువత మంచి నడవడికను అలవాటు చేసుకుని దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి మహమూద్ అలీ కోరారు. తెలంగాణ నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ మాదకద్రవ్యలపై చాలా కఠినతరమైన చర్యలకు పూనుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్కు బానిసలుగా మారి యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
డీజీపీ అంజనీ కుమార్..
” చిన్న వయసులోనే హీరోయిన్ కృతి శెట్టి పలు భాషల్లో నటిస్తూ రాణిస్తోంది. ఎంత ప్రతిభ, ఏకాగ్రత కలిగి ఉంటే ఆమె అన్ని భాషల్లో నటిస్తూ రాణిస్తుందో అర్ధం చేసుకోవాలి. 11కోట్ల మంది డ్రగ్స్ మాయలో పడి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. కేవలం మాదక ద్రవ్యాలు నిషేధించడం మాత్రమే కాదు. మాదకద్రవ్యాలను తీసుకునే వారిని అలెర్ట్ చేసి వారిని డ్రగ్స్ బారి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది.
Also Read..BRS Expansion: సర్వే సంస్థల నివేదికల ఆధారంగా.. జాతీయస్థాయిలో కేసీఆర్ పకడ్బందీ స్కెచ్!
డ్రగ్స్ ను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం గౌరవంగా భావిస్తున్నట్లు హీరోయిన్ కృతి శెట్టి తెలిపారు. యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం బాధ కలిగించే విషయం అన్నారు. దేశానికి తమ ప్రతిభ చూపించాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరం అని వాపోయారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలు అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.