Eamcet Exam
Eamcet Exam: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐదురోజులు ఎంసెట్ పరీక్ష జరగనుంది. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల వారికి, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9-12 గంటల మధ్య తొలి విడత, మధ్యాహ్నం 3-6 గంటల మధ్య మలివిడత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎంసెట్ పరీక్షలకు గాను మొత్తం 3,20,292 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అగ్రికల్చర్కు 1,15,361 మంది. ఇంజనీరింగ్ విభాగంకు 2,05,405 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,53,935 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 94,614 మంది పరీక్ష రాయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 51,470 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంనుంచి 20,747 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 7.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యం అయితే లోపలికి అనుమతి ఉండదని ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.
ఎంసెట్ పరీక్ష కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి వచ్చేవారు.. కాలేజీ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ కార్డును వెంట తెచ్చుకోవాలని ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో- కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డిలు తెలిపారు.