Anjani Kumar : మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీకుమార్ యాదవ్ పై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే.
- Harishth Thanniru
- Published On : December 12, 2023 / 09:38 AM IST
Anjani Kumar
IPS Officer Anjani kuma : తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే. తాజాగా అంజనీకుమార్ పై విధించిన సస్పెన్షన్ ను ఈసీ ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఈసీకి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ ఈసీకి వివరణ ఇచ్చారు. దీంతో ఆయన వివరణకు సంతృప్తి చెందిన ఈసీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
Also Read : CM Mohan Yadav: బీజేపీ బిగ్ టార్గెట్! మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ఎంపికకు మూడు కారణాలు.. అవేమిటంటే?
అసలేం జరిగిందంటే..
గతనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. పూర్తిస్థాయిలో కౌంటింగ్ పూర్తికాకముందే తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ మధ్యాహ్నం సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ తో రేవంత్ వద్దకు వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాకముందే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకరంగా కలవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీగా ఉన్న అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటువేసింది. మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Also Read : CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు కుటుంబాలకు శుభవార్త
అంజనీకుమార్ స్థానంలో రవిగుప్తాను డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్ పై ఈసీకి అంజనీకుమార్ వివరణ ఇవ్వడంతో పాటు.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు. దీంతో ఈసీ సస్పెన్షన్ ఎత్తివేసింది.
