నయా నాటకానికి తెరతీశారు..! కాంగ్రెస్ జనజాతర సభపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు

75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. జనగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.

Former Minister KTR

KTR : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా విమర్శలు చేశారు. అది జనజాతర సభ కాదు.. హామీల పాతర.. అబద్ధాల జాతర సభ. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట గారడీ చేశారు.. పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి, ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు? నమ్మి ఓటేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలుగా నయవంచన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

Also Read : Hyderabad Metro : ఛార్జీలు పెంచకుండానే హైదరాబాద్ మెట్రో షాక్.. టికెట్‌పై రాయితీలు, హాలిడే కార్డు రద్దు

అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది. నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది. గ్యారెంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తోందంటూ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు.. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు. మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు.

Also Read : ఎన్నికలవేళ నగదు, బంగారం తీసుకెళ్తున్నారా..? సీఈవో వికాస్ రాజ్ ఏం చెప్పారంటే

రాహుల్ గాంధీకి తెలంగాణలో అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా? 200 కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా? చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీ పై సర్కార్ ను నిలదీయరా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.

Also Read : CM Revanth Reddy : బిడ్డా గుర్తు పెట్టుకో.. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని- కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం

చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సకల రంగాలను సంక్షోభంలో నెట్టిన భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. అందుకే.. వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చేతితో గుణపాఠం చెప్పడం ఖాయం అంటూ కేటీఆర్ అన్నారు.