KTR: ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా.. వెనక్కు వెళ్లిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్పై సంచలన వ్యాఖ్యలు
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. దీంతో ఆయన ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు తన లాయర్ తో కలిసి వెళ్లారు.
- Harishth Thanniru
- Published On : January 6, 2025 / 11:05 AM IST
Formula E-Car Race Case BRS Leader KTR Returned from ACB Office
KTR Formula E-Car Race Case: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమవారం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. ఏసీబీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనతో ఆయన కార్యాలయంలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. సోమవారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ కు హాజరు కావాలని సూచించారు. దీంతో సోమవారం ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు తన న్యాయవాదితో కలిసి కేటీఆర్ వెళ్లారు. అయితే, పోలీసులు ఏసీబీ కార్యాలయంలోకి తన న్యాయవాదిని అనుమతించ లేదు. దీంతో కేటీఆర్ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో కేటీఆర్ మాట్లాడగా.. న్యాయవాదికి అనుమతి లేదని చెప్పారు. న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను కేటీఆర్ కోరారు. పోలీసులు ఎంతకీ కేటీఆర్ తోపాటు తన లాయర్ కు అనుమతి ఇవ్వకపోవటంతో ఆయన ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు.
Also Read: Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నానికి ఊరట లభిస్తుందా..!
ఏసీబీ ప్రధాన కార్యాలయంకు బయలుదేరే ముందు నందినగర్ లోని ఆయన నివాసం లో కేటీఆర్ న్యాయవాదులతో చర్చించారు. సుమారు అర్ధగంటపాటు న్యాయవాదులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయంకు బయలు దేరారు. అయితే, కేటీఆర్ తో పాటు తన లాయర్ ను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించక పోవటంతో కేటీఆర్ విచారణకు హాజరుకాకుండానే వెనక్కు వెళ్లిపోయారు.
Also Read: Bandi Sanjay : ఏడాది పాటు రైతు భరోసా ఎగ్గొట్టారు- రేవంత్ సర్కార్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ ఏసీబీ కార్యాలయానికి రమ్మన్నారు. వచ్చాను. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా. ఇంతమంది పోలీసులెందుకు? న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలి.. పోలీసులు ఎందుకు చెబుతున్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టారు. దాని నుంచి దారి మళ్లించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు కొట్లాడతాం.. కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
నా వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పాను. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయినా నాతోపాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టం ఏమిటి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. లాయర్ లేకుండా విచారణకు వెళితే నేను చెప్పని మాటలను కూడా చెప్పారని ప్రచారం చేస్తారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా నాకు ఉన్న హక్కు. లాయర్ ను అనుమతించకపోతే నేను విచారణకు వెళ్లను అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
