Indiramma Indlu
Indiramma Indlu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తొలి విడతలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లను మంజూరు చేయనుంది. అయితే, ఈ జాబితాలో ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేవారికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ పథకం కింద అర్హులుగా ఎంపికైన వారికి ప్రభుత్వం నాలుగు విడుతల్లో రూ. 5లక్షల సొమ్మును అందజేయనుంది. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ పథకం అమలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అందరూ భావించారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది : సీఎం చంద్రబాబు
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని హౌసింగ్ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఇండ్ల నిర్మాణం ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
శనివారం సెక్రటేరియెట్ లో రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్ పీఆర్ ఉన్నతాధికారులతో 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు భట్టి తెలిపారు.
ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టిసారించాలని భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ మహానగరంలో మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, కావాల్సిన భూమికోసం రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. భూమిని సేకరించుకోవాలని చెప్పారు.
సినీ కళాకారులను ప్రోత్సహించడంతోపాటు, సమాజ వికాసానికి దోహదపడేలా షార్ట్ ఫిల్మ్స్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు, ప్రభుత్వ పథకాలను వీటి ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు.