×
Ad

BRS: ఖైరతాబాద్ ఉపఎన్నికకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్..! గెలిచేందుకు ఖతర్నాక్ ప్లాన్..!

ఖైరతాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఈసారి సంక్రాంతి పండగ సందర్భంగా దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటాపోటీగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారన్న చర్చ సాగుతోంది.

Talasani Srinivas Yadav Representative Image (Image Credit To Original Source)

  • ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్
  • బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ప్లాన్‌లో గులాబీ పార్టీ
  • ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్?
  • తన కొడుకు సాయిని పోటీ చేయించే ప్లాన్‌లో తలసాని?
  • తన తనయుడుకి టికెట్ ఇవ్వాలంటూ గులాబీబాస్‌కు రిక్వెస్ట్?

 

BRS: జూబ్లీహిల్స్‌ను కోల్పోయాం. ఖైరతాబాద్‌ను మాత్రం వదులుకునే ముచ్చటే లేదంటోంది కారు పార్టీ. ఈసారి గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉంది. ఫిరాయింపు ఎపిసోడ్‌లో దానం నాగేందర్ రాజీనామానో..లేక ఆయనపై వేటు పడటమో ఖాయమని..ఉప ఎన్నిక రావడం కూడా పక్కా అని ఫిక్స్‌ అయిందట గులాబీ పార్టీ. అందుకే బలమైన అభ్యర్థి కోసం సెర్చ్ చేస్తోందట. అయితే ఖైరతాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారట ఓ మాజీమంత్రి. తనయుడిని బైపోల్‌ సమరంలోకి దింపాలని ట్రై చేస్తున్నారట. ఇంతకు ఎవరా మాజీమంత్రి? ఆయన అభ్యర్థనకు గులాబీ దళపతి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి?

ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో నెమ్మదిగా ఒక్కో స్టెప్‌ దాటి..ఇష్యూ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏడుగురు జంపింగ్‌ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఫిరాయింపు ఇష్యూలో స్పీకర్ డెసిషన్‌ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే కడియం, సంజయ్‌ విషయంలో ఎలా ఉన్నా..దానంపై వేటు పడటం ఖాయమని..లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారని బీఆర్ఎస్ అంచనా వేస్తోందట.

ఈ క్రమంలో ఖైరతాబాద్‌ అసెంబ్లీ సీటుకు బైఎలక్షన్‌ రాబోతుందని బలంగా నమ్ముతోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్‌ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు ఉండటం, లేటెస్ట్‌గా దానం చేసిన వ్యాఖ్యల దృష్ట్యా..ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదన్న చర్చ జరుగుతోంది.

ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదల..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశతో ఉన్న బీఆర్ఎస్‌..కచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉందట. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్ను పడినట్లు తెలుస్తోంది.

తన కుమారుడిని పోటీ చేయించే ప్లాన్‌లో తలసాని?

ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో తన కుమారుడు సాయికిరణ్‌ యాదవ్‌ను దించాలని తలసాని భావిస్తున్నారట. తన మనసులో మాటను ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దగ్గర ప్రస్తావించారట తలసాని. ఖైదరాబాద్‌లో దానంపై పోటీ చేసి గెలవాలంటే బలమైన అభ్యర్ధి కావాలని, అందుకే తన కొడుకు సాయికి టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిపించుకుంటానని కేసీఆర్‌కు చెప్పారట. అటు సికింద్రాబాద్, ఇటు సనత్‌నగర్‌లో గట్టి పట్టుంది కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల మధ్య ఉన్న ఖైరతాబాద్‌లో తన కొడుకుని నిలబెట్టి ఈజీగా గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారట తలసాని.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన తలసాని సాయికిరణ్‌ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచారు. ఇప్పుడు మళ్లీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నాడట. ఖైరతాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఈసారి సంక్రాంతి పండగ సందర్భంగా దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటాపోటీగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారన్న చర్చ సాగుతోంది. తన సొంత నియోజకవర్గం ఖైరతాబాద్‌లోని ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో దానం కైట్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయగా, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కూడా జలవిహార్ పక్కన గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. అయితే తలసాని రిక్వెస్ట్‌కు గులాబీ బాస్ ఓకే చెప్తారా? ఖైరతాబాద్ ఉప ఎన్నిక తలసాని సాయికిరణ్‌కే దక్కబోతోందా లేదా అనేది చూడాలి.

Also Read: మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్‌‌ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..